ఆ దేశాలను లక్ష్యంగా చేసుకుంటాం: పుతిన్ కీలక వ్యాఖ్యలు

  • ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామన్న పుతిన్
  • ఆ దేశాలను లక్ష్యంగా చేసుకునే హక్కు ఉందని స్పష్టీకరణ
  • దీర్ఘకాలిక శాంతి కోరుకుంటే బలగాలు మోహరించాల్సిన అవసరం లేదని వెల్లడి
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తమకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించే అధికారం తమకు ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో తమ సైనిక దళాలను మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

ఉక్రెయిన్‌కు అనుకూలంగా బలగాలను మోహరించడం దీర్ఘకాలిక శాంతికి ఏ మాత్రం దోహదం చేయదని పుతిన్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న సన్నిహిత సైనిక సంబంధాలే ప్రస్తుత సంఘర్షణకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలమై యుద్ధం ముగిస్తే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇతర దేశాల సైనిక దళాలను మోహరించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

నిజంగానే దీర్ఘకాలిక శాంతిని కాంక్షిస్తే సైనిక బలగాలు మోహరింపు అవసరం లేదని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యా... చేసుకున్న ఒప్పందాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్యారిస్‌లో 26 యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన నేపథ్యంలో పుతిన్ ఈ విధంగా స్పందించారు.

Vladimir Putin
Russia
Ukraine
Ukraine war
Europe
Zelensky
Paris
Military
Conflict

More Telugu News